జేసీ బ్రదర్స్‌ కంపెనీపై 24 క్రిమినల్‌ కేసులు

10 Jun, 2020 04:18 IST|Sakshi
మాట్లాడుతున్న రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు. పక్కన అధికారులు శ్రీనివాస్, రమాశ్రీ

154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మేశారు

నకిలీ బీమా పత్రాలు సృష్టించినట్లు గుర్తింపు

వాటిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు లేఖ

రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన జేసీ బ్రదర్స్‌ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్‌పై 24 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ (రోడ్‌ సేఫ్టీ) ఎస్‌ఏవీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ పి.శ్రీనివాస్, జాయింట్‌ కమిషనర్‌ (ఐటీ, ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎల్‌ఎస్‌ఎం రమాశ్రీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రసాదరావు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. 

► అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్‌–3 లారీలను తుక్కు (స్క్రాప్‌) కింద విక్రయించగా.. వాటిని జేసీ బ్రదర్స్‌ కంపెనీ కొనుగోలు చేసింది. 
► వాటిలో 98 లారీలను నాగాలాండ్‌లో, 32 లారీలను ఏపీలో, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో 24 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు.   
► ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది. 
► వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన మొత్తం లారీలను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు లేఖ రాశారు. 
► జాతీయ డేటాబేస్‌ ‘వాహన్‌’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరాం.  ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాం. మిగిలిన ఆరు లారీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం. 
► ఇందులో 80 లారీలు అనంతపురం, 5 కర్నూలు, మరో 5 చిత్తూరు, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున ఉన్నాయి.     లారీల బీమా పత్రాలను పరిశీలించగా.. అవి కూడా నకిలీవేనని తేలాయి. యునైటెడ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బీమా కంపెనీలకు సమాచారం ఇచ్చాం. 
► అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు వివిధ జిల్లాల్లో విక్రయించారు.  కొనుగోలు చేసిన వారు తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్‌ కంపెనీపై చీటింగ్‌ కేసులు పెట్టారు. 
► వారిని జేసీ బ్రదర్స్‌ సంప్రదించి వ్యవహారం సెటిల్‌ చేసుకునేందుకు రూ.12 నుంచి రూ.14 లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు మా దృష్టికి వచ్చింది. 
► ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్‌ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు