లోయలో పడ్డ బస్సు.. 25 మంది మృతి

20 Jun, 2019 19:09 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బస్సు

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 25 మంది మృతిచెందారు. మరో 35మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు పైన కూడా కొందరు ప్రయాణికులు కూర్చున్నట్లు తెలుస్తోంది. బస్సు కులు జిల్లాలోని బంజర్‌  సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

బస్సు బంజర్‌ నుంచి గడగుషానికి వెళ్తుండగా అదుపు తప్పి సుమారు 500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి సంతాపం

హిమాచల్‌ ప్రదేశ్‌ బస్సు ప్రమాద ఘటన పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు