ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌

20 Sep, 2019 14:23 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని డీఎన్‌డీ ఫ్లైఓవర్‌ వద్ద ఆగి ఉన్న ట్రక్కును అంబులెన్స్‌ ఢీకొన్న ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఘటనపై స్పందించిన జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. తెల్లవారు జామూన 4.30 గంటల ప్రాంతంలో గర్భిణి మహిళను నోయిడా ఆసుపత్రి నుంచి సఫ్దర్‌ఫ్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో సౌరభ్‌(2), నర్సింగ్‌ సిబ్బంది సునీల్‌ కుమార్‌(35) మరణించినట్లు వెల్లడించారు.

ప్రమాదంలో  గాయపడిన మనూ(35), ఆమె భర్త సురేశ్‌(25), వారి కూతురు(4), అంబులెన్స్‌ డ్రైవర్‌ విపిన్‌కుమార్‌(25)లను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో మయూర్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆగి ఉన్న ట్రక్కును అంబులెన్సు వేగంగా ఢీకొట్టినట్లు సమాచారం అందిందని అలోక్‌ వివరించారు. వెంటనే పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని ఎయిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం, ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అలోక్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు