సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీవద్ద ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన సంభవించింది. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన వీరంతా బొప్పాయి పళ్లను మార్కెట్లో అమ్మేందుకు ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అనే వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
(చదవండి: కనిపెంచిన తల్లిని అడవిలో వదిలేశారు)