తాతను చూసి సంతోషపడింది.. కానీ అంతలోనే

16 Aug, 2019 08:02 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : హాజీపూర్‌ మండలంలోని గుడిపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల అశ్విత(5) అనే చిన్నారి మృతి చెందింది. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన మేకల సరిత తన ఇద్దరు కుమార్తెలు అశ్మిత, అశ్విత(5)తో కలిసి రాఖీ పండగ సందర్భంగా గుడిపేట పేటలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం మంచిర్యాలకు వెళ్లిన సరిత తన కుమార్తెలతో తిరిగి మంచిర్యాల నుంచి బస్సులో బయలు దేరి గుడిపేట బస్టాండ్‌ వద్ద దిగింది.

బస్టాండ్‌లో దిగిన తన కుమార్తె సరిత, మనుమరాలు అశ్వితలను ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన సరిత తండ్రి కంకణాల మల్లయ్య వారి కోసం రోడ్డు అవతల వైపు ఉండి చూస్తూ ఉన్నాడు. తాతను గమనించిన అశ్విత ఒక్కసారిగా తాత వద్దకు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో నిర్మల్‌ నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అశ్వితను వేగంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 

ఉదయం నుంచి సంతోషంగా..
గుడిపేటలో ఉంటున్న తన ఇద్దరు సోదరులకు రాఖీ కట్టేందుకు కుమార్తెలతో వచ్చిన సరిత ఉదయం రాఖీ కట్టి ఇంట్లో అందరితో సరదాగా గడిపింది. మంచిర్యాలకు వెళ్లి వస్తా అని వెళ్లిన తమ సోదరి సరిత తన కుమార్తెను పొగొట్టుకోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు బస్సులో తల్లి ఒడిలో కూర్చున్న చిన్నారి అశ్విత(5) క్షణాల్లో రోడ్డు ప్రమాద బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. సంఘటనా స ్థలాన్ని మంచిర్యాల రూరల్‌ సీఐ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాలిక తండ్రి మేక ల నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు