ఆర్టీసీ బస్సు ఢీ.. ఏడుగురు దుర్మరణం

16 Mar, 2020 16:09 IST|Sakshi

మెదక్‌ జిల్లా సంగాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సాక్షి, మెదక్‌: జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌​ కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మెదక్‌లోని ఏడుపాయల జాతరకు వీరంతా డీసీఎం వ్యాన్‌లో వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కాగా, ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి సందర్శించారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దిగ్భాంతి వ్యక్త చేశారు. మృతుల కుటుంబాలను, క్షతాగాత్రులను ఆదుకుంటామని హామినిచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, ఆర్టీసీ అదికారులను ఆదేశించారు. మృతుల వివరాలు.. గూడల మనెమ్మ, గూడల దుర్గమ్మ, మధురిమ, రజిత, మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. మృతులంతా మహిళలే కావడంతో వారి పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు