చదువుకోవటం ఇష్టం లేక.. బాలుడి అతి తెలివి

30 Aug, 2018 15:20 IST|Sakshi
వరుణ్‌(ఫైల్‌ ఫోటో), సీసీటీవీ దృశ్యాలు

సాక్షి, వేములవాడ : చదువుకోవటం ఇష్టంలేని ఏడేళ్ల బాలుడు అతి తెలివిగా ఆలోచించి కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. ఈ సంఘటన గురువారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన వరుణ్‌ 7వ తరగతి చదువుతున్నాడు. చదువుకోవటం ఇష్టం లేని వరుణ్‌ ఇంటినుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. గురువారం తమ్ముడు శుశాంత్‌తో కలిసి పాఠశాలకు బయలుదేరాడు. మార్గం మధ్యలో.. తనను కిడ్నాప్‌ చేసినట్లు అమ్మకు చెప్పాలని తమ్ముడితో ఒట్టు వేయించుకున్న వరుణ్‌ అక్కడినుంచి పారిపోయి వరంగల్‌ బస్సెక్కాడు.

అతడి తమ్ముడు ఇంటికి చేరుకుని.. అన్నయ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిగా నిజాలు తేటతెల్లమయ్యాయి. చదువుకోవటం ఇష్టంలేక ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని పట్టుకోవాలని అతడు ప్రయాణిస్తున్న బస్‌ నెంబర్‌ను హుజురాబాద్‌ పోలీసులకు ఇచ్చారు. త్వరలో బాలుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు