దారుణం: పెళ్లింట విషాదం

25 Nov, 2019 11:32 IST|Sakshi

బొలేరో వాహనం బోల్తా

ఎనిమిది మందికి గాయాలు

ముగ్గురి పరిస్థితి విషమం

సాక్షి, మహబూబ్‌నగర్‌ : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా.. మద్దూర్‌ మండలం దోరేపల్లికి చెందిన రాధికతో వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం గౌరారం గ్రామానికి చెందిన నరేష్‌తో ఈ నెల 22న వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి తీసేందుకు నూతన దంపతులతోపాటు ఇరు కుటుంబాల వారు అబ్బాయి స్వగ్రామం గౌరారానికి బొలేరో వాహనంలో బయల్దేరారు. గండిహనుమాన్‌ తండా శివారులోకి రాగానే వాహనం జాయింట్‌ రాడ్‌ విరిగిపోయింది.

దీంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ సంఘటనలో నూతన దంపతులతోపాటు మరో ఆరుగురి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లల కాళ్ళు విరిగిపోయి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారందరిని 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పెళ్లికుమారుడు తల్లి భీమమ్మ, పెళ్లికూతురు తల్లి లక్ష్మమ్మల పరిస్థితి విషమంగా ఉంది. శివకుమార్‌ అనే ఏడేళ్ల బాలుడి కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. వీరితోపాటు శ్రీకాంత్, లక్ష్మీ, అశోక్, రాధిక, నరేష్‌లకు సైతం గాయాలయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఘటనలో గాయపడ్డ చిన్నారులు

>
మరిన్ని వార్తలు