దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

2 Sep, 2019 19:32 IST|Sakshi
క్రిషన్ కోస్లా

సాక్షి, న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కనీసం వయస్సుకు విలుక ఇవ్వని దుండగులు 90 ఏళ్ల  వృద్దుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది కూడ మత్తు మందు ఇచ్చి ఫ్రిజ్‌లో కుక్కి కిడ్నాప్‌ చేశారు. ఇంట్లో పనిచేసే యువకుడే మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌కు సహకరించాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 90ఏళ్ల క్రిషన్ కోస్లా అనే రిటైర్ ఉద్యోగి తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వారిఇద్దరు కుమారుల్లో ఒకరు విదేశాల్లో ఉండగా మరో కుమారుడు ఢిల్లీలో పారిశ్రామికవేత్త. వృద్ద దంపతులకు తోడుగా ఇంట్లో పనిచేసేందుకు ఓ యువకున్ని ఏడాది క్రితం నియమించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే గత శనివారం సాయంత్రం ఇంట్లోకి వచ్చిన యువకుడు రోజూ మాదిరి టీ తీసుకొచ్చి వృద్ధ దంపతులకు ఇచ్చాడు. అయితే కిడ్నాప్‌కు పథకం పన్నిన యువకుడు ఆ టీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.  అనంతరం ఆ యువకుడు రాత్రీ ఎనిమిది గంటలకు మరో నలుగురు మిత్రులను ఇంటికి పిలిచాడు. ఐదుగురు కలిసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, ఫ్రిజ్‌ను తీసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ మాత్రం పాత సామాను అమ్మడానికి వెళ్తున్నరనుకోని చూసి చూడనట్లు వదిలేశాడు. అయితే వారు ఫ్రిజ్‌లో క్రిషన్‌ను కుక్కి కిడ్నాప్‌ చేశారన్న విషయాన్ని గమనించలేకపోయాడు. 

మత్తమందుతో నిద్రలోకి జారుకున్న క్రిషన్ భార్య ఆదివారం ఉదయం మేలుకునే సరికి భర్తతో పాటు ఇంట్లో పని చేసే యువకుడు సైతం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దుండగులు కోస్లాను కిడ్నాప్ చేశారా ఇంకా ఏదైన చేశారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు