ఎస్‌ఐపై దోపిడీ దొంగల దాడి

26 Sep, 2017 03:55 IST|Sakshi

ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద ఘటన

మార్టూరు: దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. వీరిని పట్టుకోవడానికి నిఘా పెట్టిన ఎస్‌ఐపై కత్తితో దాడి చేశారు. సోమవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొంగలు సంచరిస్తున్నారని, రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు, లారీల డ్రైవర్లను బెదిరించి దోపిడీలు చేస్తున్నారని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తన సిబ్బందితో కలసి మఫ్టీలో నిఘా పెట్టారు. టోల్‌గేట్‌ సమీపంలో జె.పంగులూరు మండలం రామకూరు వెళ్లే మట్టిరోడ్డు వద్ద సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఎదురయ్యారు. అనుమానం వచ్చిన ఎస్‌ఐ వారిని నిలువరించారు. పోలీసులు అని గుర్తించిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిని వెంబడిస్తున్న ఎస్‌ఐపై కత్తితో దాడి చేశారు. దీంతో ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు ఎడమ భుజం, చేతిపై గాయాలయ్యాయి. ఆయన షాక్‌ నుంచి తేరుకునే లోపే దొంగలు పరుగు తీస్తూ పొలాల్లోకి వెళ్లిపోయారు. అనంతరం హోమ్‌గార్డులు రవి, నాగూర్‌లు ఎస్‌ఐని చికిత్స నిమిత్తం మార్టూరు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయాలకు కుట్లు వేసి ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.

మరిన్ని వార్తలు