ఏ1 రిసార్ట్స్‌ యాజమాని లొంగుబాటు

12 Sep, 2018 13:29 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌

రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌

తూర్పుగోదావరి, రంపచోడవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రేవ్‌ పార్టీ వ్యవహరంలో దేవరాతిగూడెంలోని ఏ–1 రిసార్ట్స్‌ యాజమాని బి రమణమహర్షి(బాబ్జి) మంగళవారం రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల ఏడో తేదీన దేవరాతిగూడెం ఏ1 రిసార్ట్స్‌లో యువతులతో కలిసి కొంత మంది పురుషులు నృత్యాలు చేస్తూ రేవ్‌ పార్టీ జరుగుతుందనే సమాచారంతో స్థానిక సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై జె విజయబాబు దాడి చేసి విజయవాడకు చెందిన 21 మంది పురుషులను, ఎనిమిది మంది యువతులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఏ1 రిసార్ట్స్‌ యాజమానిని బుధవారం రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న యువతులకు రంపచోడవరం సీడీపీఓ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న పురుషులు, యువతులకు 41ఏ సీఆర్‌సీపీ నోటీసులు జారీ చేసి పంపించామన్నారు. ఈ కేసుకు  సంబంధించి అన్ని చట్ట ప్రకారం చేసినట్టు వెల్లడించారు. ఏజెన్సీలో సేఫ్‌ టూరిజం అభివృద్ధికి పోలీస్‌ శాఖ తమ వంతు కృషి చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు