ఏసీబీ వలలో ‘మూడు అవినీతి చేపలు’

9 Jan, 2020 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒకే రోజు ముగ్గురు అవినీతి అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీకి చిక్కారు. బాధితుల ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వారిని రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డి ఓ సివిల్‌ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాడెండ్‌గా చిక్కాడు. స్టేషన్‌లో ఎస్‌ఐను రెండు గంటలుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 2014 బ్యాచ్ కి చెందిన సుధీర్ రెడ్డి స్వస్థలం మెదక్ జిల్లా గజ్వేల్. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో 18 నెలలుగా పనిచేస్తున్నారు. శేరిలింగంపల్లి లో రూ. 15 వేలు  లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ట్యాక్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ యాదగిరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. డీసీపీవో స్టేట్‌ జీఎస్టీ అధికారి కొమ్మ బుచ్చయ్య రూ.35వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ కేసులో కొత్త ట్విస్ట్‌..
50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. సీఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే ఎస్‌ఐ లంచం తీసుకున్నారని ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సిఐ బల్వంతయ్యను కూడా విచారణ చేస్తామని చెప్పారు. 2019 డిసెంబర్‌ 29న ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లోక్‌ అదాలత్‌లో సెటిల్‌ చేస్తానంటూ సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చి.. లక్ష రూపాయలు డిమాండ్‌ చేశారని తెలిపారు. రూ. 50వేలు తీసుకుంటుండగా జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, డబ్బుతో పాటు రెండు లిక్కర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు


 

మరిన్ని వార్తలు