మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడి

11 Jan, 2020 08:14 IST|Sakshi
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద గుమికూడిన జనం

సోదాల్లో రూ.86,810 స్వాధీనం

సబ్‌ రిజిస్ట్రార్‌ సహా 15 మందిపై కేసులు

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడిచేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశులురెడ్డి, కింది స్థాయి సిబ్బంది ఏర్పాటు చేసుకున్న బినామీ వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నుంచి రూ.86,810 స్వాధీనం చేసుకున్నారు.ఎటువంటి రసీదులు లేకుండా డబ్బు కలిగి ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబ„Š  విలేకరుల సమావేశంలో వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశులురెడ్డి, సిబ్బంది సుమారు 15 మందికిపైగా అనధికారికంగా వ్యక్తులను నియమించుకున్నారు. వారి ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో సమాచారం అందడంతో ఏసీబీ తిరుపతి అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు అధికారుల బృందం దాడి చేసింది. ట్రాన్స్‌కో డెప్యూటీ డీఈ మాధవరావు సమక్షంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయ ఆవరణం, గేటు బయట ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు, బినామీ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అనధికారికంగా ఉన్న నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ సీఐలు ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, ఎస్‌ఐ నాగేంద్ర, మరో 10 మంది సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు