ఇసుక మింగి పసుపు పులుముకున్న బ్లూ ఫ్రాగ్‌ సంస్థ

15 Nov, 2019 20:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇసుక మింగి పసుపు పులుముకున్న ఎల్లోఫ్రాడ్‌ కంపెనీగా రూపాంతరం చెందిన బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థపై అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ని హ్యాక్‌ చేసిన ఆరోణలపై తీగలాగగా డొంకంతా కదులుతోంది. సంస్థ నిర్వాహకులను విచారిస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగంవంతం చేశారు. ఈ క్రమంలో హ్యాకింగ్‌పై సాక్ష్యాధారాలు కూడా సేకరించామని, కొన్ని రోజుల వ్యవధిలోనే అక్రమార్కుల పనిపడతామని సీఐడీ అధికారి ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. కాగా ఈ బ్లూ ఫ్రాగ్‌ సంస్థ.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేసి ఇసుక కృత్రిమ కొరతను సృష్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు.

అదే విధంగా విచారణలో ఆధారాలు సేకరించామని, సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించి ముందుకు సాగుతామని సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. అదే విధంగా క్లౌడ్‌లో పెట్టిన సమాచారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే వారి ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్‌ చేసి విచారిస్తున్నామని అన్నారు. కాగా అక్రమ నిల్వల కోసం ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌చేసే వారిపై కూడా నిఘా పెడుతున్నామని ఏడీజీ సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు