దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

5 Dec, 2019 20:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌లో నిందితురాలు దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఆమె వందకోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆమెకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త గురుమూర్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్) సహకరించినట్లు అధికారులు తెలిపారు.

ఆస్తులు వివరాలు ఇవే..
నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్‌లో దేవికారాణికి చెందిన రూ. 34లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. వేర్వేరుగా 23 బ్యాంకుల్లో రూ. కోటీ 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపారు. దేవికారాణి ఇంట్లో రూ. 25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఇంట్లో రూ. 8.40 లక్షల నగదు, రూ. 7లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 20 లక్షల ఇన్నోవా కారు, రూ. 60 వేల మోటర్ బైక్‌ను సీజ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తించామని అన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 100 కోట్లపైగా ఉంటుందన్నారు. పీఎంజే జ్యువెల్లర్స్ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు