చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి

14 Jun, 2019 19:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ను సోషల్‌ మీడియా ద్వారా దుండగులు వేధింపులకు గురిచేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా 10 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం వీరిని అదుపులోకి తీసుకున్నారు.

తనతో పాటు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారని కళ్యాణ్‌ దేవ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉందని, మరో ఖాతాను ఉపయోగిస్తూ కొందరు పోకిరీలు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమపై పోకిరీలు చేస్తున్న కామెంట్లను డిలీట్‌ చేయడం, ఆయా ఖాతాలను బ్లాక్‌ చేసినా.. కొత్త ఖాతాల ద్వారా వేధిస్తున్నారంటూ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వేధింపులకు పాల్పడిన వారి ఖాతాల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ నుంచి తెప్పించుకుని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు