‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

7 Dec, 2019 02:15 IST|Sakshi

‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’ తర్వాతి రోజు షాద్‌నగర్‌కు నిందితులు

పాతిపెట్టిన ఆధారాల కోసం తీసుకెళ్లగా పోలీసులపై దాడి

పిస్టళ్లు లాక్కుని కాల్పులు జరిపిన ఆరిఫ్, చెన్నకేశవులు

రాళ్లు, కర్రలతో నవీన్, శివ దాడి

ఆత్మరక్షణ కోసం పోలీసుల ఎదురు కాల్పులు

 చటాన్‌పల్లి బ్రిడ్జికి 300 మీటర్ల దూరంలో ఘటన  

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితులు ఎన్‌కౌంటర్‌కు దారితీశా యి. ఉదయం 5:45 నుంచి 6:15 గంటల మధ్యలో పోలీసులు, నిందితులకు జరిగిన కాల్పుల్లో ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

షాద్‌నగర్‌ పీఎస్‌ నుంచే..
వాస్తవానికి షాద్‌నగర్‌ కోర్టు ఈ నెల 3 నుంచి 13 వరకు దిశ హత్య కేసు నిందితులను పోలీసు కస్టడీకి ఇచ్చింది. కానీ, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి నిందితులను చర్లపల్లి జైలులోనే విచారించారు. వారి నుంచి లభించిన కీలక సమా చారం మేరకు చర్లపల్లి నుంచి బుధవారం రాత్రి కస్టడీకి తీసుకున్నారు. అదేరోజు అర్ధరాత్రి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం తొండుపల్లి టోల్‌గేట్, దిశను కాల్చిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. తెల్ల వారడంతో మళ్లీ నిందితులను షాద్‌నగర్‌ తీసుకెళ్లా రు. గురువారం రోజంతా స్టేషన్‌లోనే విచారించా రు. అప్పుడే వారు దిశ మొబైల్, ఇతర వస్తువుల గురించి కీలక సమాచారం వెల్లడించారు. దీంతో రెండోసారి నిందితులను బస్సులో శుక్రవారం ఉదయం 5 గంటలకు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకి తీసుకొచ్చారు. వారితోపాటు పదిమంది ఎస్కార్టు, మూడు వాహనాల్లో పోలీసులు వచ్చారు.

వస్తువులు చూపిస్తామంటూ దాడి..
దిశకు చెందిన వాచ్, మొబైల్, పవర్‌బ్యాంకు దాచిన స్థలం చూపిస్తామంటూనే నిందితులు అకస్మాత్తుగా రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగారు. దాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌ గాయపడ్డారు. ఆరిఫ్, చెన్నకేశవులు వారి వద్ద నుంచి పిస్టళ్లు లాక్కుని పోలీసులపై కాల్పులు జరుపుతూ.. పొలాల వైపు పరుగులు తీశారు. పోలీసులకు ఏం జరుగుతుం దో కాసేపు అర్థం కాలేదు. తేరుకుని గాయపడ్డవా రిని అక్కడే వదిలి మిగిలిన పోలీసులు మైక్‌సెట్‌లో అరుస్తూ లొంగిపోవాలని హెచ్చరించారు. వారి మాట లెక్కచేయని ఆరిఫ్, చెన్నకేశవులు మరోసారి కాల్పులకు దిగారు.

దీంతో ఆత్మరక్షణ కోసం పోలీ సులు ఎదురుకాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య ఉదయం 5.45 నుంచి ఉదయం 6.15 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. కాల్పులు ఆగిపోయాక పోలీసులు పరిశీలించి చూడగా.. చటాన్‌పల్లి బ్రిడ్జికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఎండిన జొన్న చేనులో ఒకే మడిలో నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఇంకా చీకటి తొల గకపోవడంతో వారు ధరించిన దుస్తుల ఆధారం గా చెన్నకేశవులు(నీలిరంగు చొక్కా), నవీన్‌ (నారింజæ), శివ (తెలుపు), ఆరిఫ్‌ (పసుపు)ను గుర్తించారు. వెంటనే ఘటనాస్థలంలో ఆధారాలు చెదిరిపోకుండా దాదాపు 10 ఎకరాల ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. 

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం..
ఎన్‌కౌంటర్‌ జరిగిందన్న విషయం ఉదయం 7 గంటల ప్రాంతంలో దావానలంలా వ్యాపించడం తో పెద్ద ఎత్తున జనాలు అక్కడకు చేరుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారితోపాటు పాత జాతీయ రహదారి మొత్తం వాహనాలతో నిండి పోయింది. అయితే, పోలీసులు మీడియాతో సహా ఎవరినీ ఘటనా స్థలంలోకి అనుమతించ కుండా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఉదయం 11 గం. ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక క్లూస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ బృందాలు అక్కడకు చేరు కుని ఆధారాలు సేకరించాయి.

నిందితుల శరీరాల నుంచి బుల్లెట్లు.. వారి చేతులపై గన్‌పౌడర్‌ రెసిడ్యూ (జీపీఆర్‌)లను, ఘటనాస్థలం పొడవునా కాల్పుల కారణంగా వెలువడిన పెల్లెట్స్‌ను సేకరిం చారు. ఆ తర్వాత రెవెన్యూ వర్గాలకు సమాచారం అందించిన పోలీసులు ఘటనాస్థలంలోనే మృతదే హాల పంచనామా ప్రక్రియ పూర్తి చేశారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తున్న సమయంలో కొందరు వైద్యులతో షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో చందూనాయక్‌ అక్కడకు వచ్చారు. దీంతో మృతులకు అక్కడే పోస్టుమార్టం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాతే క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ టీం ఆధా రాల సేకరణ పూర్తయింది. ఈలోపు పరిస్థితులను సమీక్షించిన పోలీసు యంత్రాంగం నిర్ణయాన్ని మార్చుకుని సాయంత్రం 4 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించింది.

బుల్లెట్ల కోసం పోలీసుల వెతుకులాట
ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం వెతుకులాడారు. నలుగురు నిందితులకు 11 బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే, ఎన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న విష యాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. 

ఉదయం నుంచి ఘటనాస్థలంలోనే..
ఎన్‌కౌంటర్‌ వార్త తెలియగానే దాదాపు 6 గంటలు దాటాక సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఘటనా స్థలా నికి చేరుకున్నారు. తొలుత నిందితులు దాడి చేసిన ప్రాంతాన్ని.. తర్వాత వారి శవాలు పడి ఉన్న పొ లాన్ని సందర్శించారు. అప్పటి నుంచి మృతదేహా లను తరలించే వరకు అక్కడే ఉన్నారు. 

కేర్‌లో పోలీసులకు చికిత్స..
దాడిలో గాయపడ్డ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టే బుల్‌ అరవింద్‌గౌడ్‌లను ముందు స్థానిక ఆసుప త్రికి తరలించారు. వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో గాయం కాగా, అరవింద్‌గౌడ్‌ కుడి భుజా నికి గాయమైంది. ఇరువురికీ స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో హైటెక్‌సిటీలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.ఉదయం నుంచి ఘటనా స్థలంలోకి మీడియాను అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఎట్టకేలకు నిందితుల శవాలు పడి ఉన్న మడిలోకి మీడియాను అనుమతించారు. 

ప్రత్యక్ష సాక్షి.. సామల సత్యం

గత నెల 28వ తేదీ తెల్లవా రుజామున ‘దిశ’ మృతదేహం కాలుతుండగా చూసి పోలీసులకు సమాచా రమిచ్చిన సామల సత్యమే తాజా ఎన్‌ కౌంటర్‌లోనూ తొలి సాక్షిగా నిలిచాడు. శుక్రవారం తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తుండగా దూరం నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. పొలం వద్దకు రాగానే.. పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిగిం దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారని ‘సాక్షి’తో చెప్పాడు. 

ఆది నుంచి గోప్యంగానే...
ఈ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దర్యాప్తు మొత్తం అత్యంత గోప్యంగా జరిపారు. ఈ కేసులో తొలి నుంచి పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదం కావడం, సకాలంలో స్పందించలేదని జాతీయ మీడియా విమర్శలు చేయడంతో విచారణను అత్యంత పకడ్బందీగా జరిపారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడం, శంషా బాద్‌ డీసీపీ నేతృత్వంలో 50మందితో ఏడు బృం దాలు ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో 20 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలన్న పట్టుదలతో ఉన్న సమయంలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 

ఎన్‌కౌంటర్‌పై కేంద్రం ఆరా
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర ప్రభు త్వం ఆరా తీసింది. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఈ కేసు వివరాలను  కేంద్ర హోంశాఖ ఎప్పటి కప్పుడు తెలుసుకుంటోంది. ఇదే క్రమంలో శుక్ర వారం ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణా మాలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయం కేంద్రానికి పంపించింది.

మరిన్ని వార్తలు