వాచ్‌మెన్‌ శరణప్ప హత్య కేసులో నలుగురి అరెస్ట్‌

14 Dec, 2019 17:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల విబేధాల కారణంగా పెట్రోల్‌ దాడిలో గాయపడి మరణించిన వాచ్‌మెన్‌ శరణప్ప కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో.. నార్త్ జోన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహాయంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని శనివారం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తన కార్యలయంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..  ప్రకాశ్‌ రెడ్డి అనే ఫ్లాట్ యజమాని దగ్గర శరణప్ప వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.

స్థల యాజమాన్య విషయమై గత కొన్నేళ్లుగా ప్రకాశ్‌రెడ్డి, మాధవరెడ్డిల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న మాధవ రెడ్డి అనుచరులు అక్కడకు వెళ్లి గొడవకు దిగడంతో పాటు.. అడ్డుకున్న వాచ్ మెన్ శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. 40 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి శరణప్ప మృతి చెందాడు. సంచలనాత్మకంగా మారిన ఈ కేసును నార్త్ జోన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఛేదించారు. నిందితులు తూముకుంట మాధవ రెడ్డి, సమల మాధవ రెడ్డి, జక్కుల సురేందర్ రెడ్డితో పాటుగా కారు డ్రైవర్ నరేష్ సింగ్‌ను అరెస్ట్ చేశామని నగర సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. ప్రధాన నిందితుడు మాధవ రెడ్డిపై గతంలో ఐదు కేసులు ఉన్నాయని తెలిపారు. నలుగురు నిందితులపై 452, 302, 120(బీ), రెడ్ విత్ 212 కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 

సైఫాబాద్ జ్యూవెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: సైఫాబాద్ పోలీసు స్టేషన్‌ పరిధిలో అటెన్షన్‌ డైవర్షన్‌ చేసి జ్యూవెలరీ చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితులు హైదరాబాద్‌లో చోరీ చేసి ముంబైకు పారిపోయారని అన్నారు. చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 60. 20 క్యారెట్‌ డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మార్కెట్‌లో పట్టుబడిన డైమండ్స్ రూ. 40 లక్షలు విలువ పలుకుతుందని అన్నారు. నిందితుడుపై ఇప్పటికే ముంబైలో 11 చీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఐదు చెక్ బౌన్స్ కేసులతో పాటు మొత్తం 16 కేసుల్లో ట్రయల్ జరుగుతున్నాయని సీపీ నిందితుని చిట్టా విప్పారు.

మరిన్ని వార్తలు