బిడ్డతో సహా నటి మృతి

22 Oct, 2019 10:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : అంబులెన్స్‌ రాక ఆలస్యమైన ఘటనలో మరాఠి నటిపూజా జంజర్‌(25) మృత్యువాతపడ్డారు. పూజతో పాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేస్తోంది. వివరాలు... ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ప్రాథమిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది.

ఈ నేపథ్యంలో పూజను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. అయితే అప్పటికే అర్ధరాత్రి దాటడంతో అంబులెన్స్‌ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా సేపటికి ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఆస్పత్రికి రావడంతో పూజను అందులో హింగోలికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా పలు మరాఠీ సినిమాల్లో నటించిన పూజ.. గర్భవతిగా ఉన్న నాటి నుంచి సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు