ప్రియుడిపై నటి నీలాణి ఫిర్యాదు

17 Sep, 2018 09:27 IST|Sakshi
నీలాణి

పెరంబూరు: పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని నటి నీలాణి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీలాణి బుల్లితెరపై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి. అయితే ఈమె ఆ మధ్య స్టెర్‌లైట్‌ పోరాట దృశ్యాలను పోలీసుల దుస్తుల్లో వెళ్లి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసి వార్తల్లోకెక్కి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందుకు గానూ పోలీసుల చేతిలో అరెస్ట్‌ అయ్యి ఆనక బెయిల్‌పై విడుదలైన నటి నీలాణి మళ్లీ టీవీ.సీరియల్స్‌లో నటిస్తోంది. ఈమెకు గాంధీలలిత్‌కుమార్‌ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. అయితే వీరి మధ్య మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఒక టీవీ.సీరీయల్‌ షూటింగ్‌లో పాల్గొంది.

అక్కడికి ఆమె ప్రియుడిగా చెప్పబడే గాంధీలలిత్‌కుమార్‌ వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగి నానా రాద్ధాంతం చేసినట్లు సమాచారం. దీంతో టీవీ సీరియల్‌ షూటింగ్‌లో కలకలం చెలరేగింది. దీంతో నటి నీలాణి స్థానిక మైలాపూర్‌ పోలీసులకు ప్రియుడు గాంధీలలిత్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. అందులో తాను గాంధీలలిత్‌కుమార్‌ స్నేహంగా మెలుగుతున్నామని తెలిపింది. అలాంటిది ఇప్పుడు  వచ్చి పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తున్నట్లు పేర్కొంది. అది తనకు ఇష్టం లేదని, షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి గొడవ చేస్తున్న గాంధీలలిత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నటి నీలాణి కోరింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు