క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్‌

16 Apr, 2019 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి పూనమ్‌ కౌర్‌ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌లో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనను కించపరిచేవిధంగా, నా వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్‌లో కొందరు పోస్టులు పెడుతున్నారని, సోషల్‌ మీడియాలోనూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా పుకార్లు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను అభ్యర్థించారు.

ఈ సందర్బంగా పూనమ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. గత రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూట్యూబ్‌లో వీడియో లింక్స్ పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు