పోలీసుల అదుపులో మాయలేడి

19 Sep, 2019 11:29 IST|Sakshi
నిందితురాలు సుమలత(ఫైల్‌) 

కొనసాగుతున్న విచారణ 

సాక్షి, బెల్లంపల్లి: కోల్‌బెల్ట్‌ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన మాయలేడీని కాసిపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన ఠాకూర్‌ సుమలత గత మూడేళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ఉద్యోగాల విషయంలో జైపూర్, దేవాపూర్‌ పవర్‌ప్లాంట్‌లలో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ నిరుద్యోగులను కలిసి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది. అనంతరం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు విసిగి వేసారి వడ్డీ నష్టపోతున్నామని వాదనకు దిగారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సైతం మోసం చేసినట్లు విన్నవించారు.

దీంతో విషయం తెలుసుకున్న సుమలత కోర్టు నుంచి ఐపీ తెచ్చుకొని నోటీసులు పంపించింది. బాధితులు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతుండగా నిందితురాలు రూ.80 లక్షలు వరకు వసూలుపై ఐపీ తెచ్చుకుంది. ఉద్యోగాల పేరిట మోసపోయింది పోయి తిరిగి ఐపీ కింద కోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసిపేట, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, వరంగల్, పర్కాల, హన్మకొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో సైతం ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. కాగా బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి సుమలత కోసం గాలించగా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరిగింది. ఎట్టకేలకు బుధవారం కాసిపేట పోలీసులు బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.  

మరిన్ని వార్తలు