నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం

11 Oct, 2019 12:51 IST|Sakshi

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

మల్కాజిగిరి: బ్రాండెడ్‌ పేరుతో నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి సీఐ మన్మోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన వనపర్తి రమేష్‌ వెంకటేశ్వర ప్రొవిజన్‌ పేరిట కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద భాష్యం రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరు పటాన్‌ చెరులోని శాలిమార్‌ రోలర్‌ ఫ్లోర్‌మిల్‌ చెందిన మైదా, గోధుమపిండిని విక్రయించేవారు. నెల రోజులుగా గౌలిగూడకు చెందిన తోట్ల బిజ్‌గోపాల్‌ వద్ద శాలిమార్‌ రోలర్‌ కంపెనీకి చెందిన బ్యాగులు తయారు చేయింన వీరు శాలిమార్‌ కంపెనీ పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఈ నెల 7న ఎస్‌ఓటీ పోలీసులు దాడిచేసి 13 మైదా బ్యాగులు, 37 ఖాలీ సంచులు, కుట్టు మెషిన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి  మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు