-

గుంటూరులో మరో దారుణం: ఏడేళ్ల చిన్నారిపై..

7 May, 2018 13:18 IST|Sakshi
నిందితుడు నాగుల్‌ మీరా

సాక్షి, గుంటూరు: మొన్నటి దాచేపల్లి ఘటనను మర్చిపోకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మోదుకూరులో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' అంటూ టీడీపీ ప్రభుత్వం చైతన్యర్యాలీలు చేపట్టినరోజే మరో కీచకపర్వం వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసు వివరాలివి..

గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్‌మీరా అనే యువకుడు అత్యాచారం జరిపాడు. పాపకు బావ వరసయ్యే నిందితుడు.. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి కంగారుతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కాగా, వారం రోజుల కిందట ఇదే గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని చనిపోయాడు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్నదని, సాక్షాత్తూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నా పోలీసులు మిన్నకుండిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు