ఫేస్‌బుక్‌ అనైతిక బంధానికి బాలుడు బలి

25 Sep, 2019 07:20 IST|Sakshi
ప్రియుడితో కలసి చెరువు వద్దకు చేరుకున్న లక్ష్మీ.. ,కొడుకు ప్రజ్వల్‌

ప్రియుని కోసం వెళ్లిపోయిన కూతురు

మనస్తాపంతో మనవన్నిచెరువులో తోసిన అమ్మమ్మ

కర్ణాటక ,మండ్య: ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన అనైతిక బంధం ఒక కుటుంబంలో చిచ్చురేపింది. ఈ సంఘటన మండ్య జిల్లా కేఆర్‌ పేట తాలూకా కేంద్రంలో వెలుగు చూసింది. కేఆర్‌పేట మారుతినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళకు చాలా ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికే భర్త మృతి చెందడంతో కొడుకు ప్రజ్వల్‌(11), తల్లి సావిత్రమ్మతో కలసి ఉంటోంది. లక్ష్మీకి కొంతకాలం కిందట ఫేస్‌బుక్‌లో మంగళూరుకు చెందిన వ్యక్తితో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుని వద్దకు వెళ్లిపోయింది.

అమ్మమ్మ అఘాయిత్యం  
దీంతో పరువు పోయిందని మనస్తాపం చెందిన తల్లి సావిత్రమ్మ మనవడితో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సోమవారం పాఠశాల నుంచి ప్రజ్వల్‌ను తీసుకువచ్చిన సావిత్రమ్మ పట్టణానికి సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి చేతులు,కాళ్లు కట్టేసి చెరువులో నెట్టేసింది. తానూ దూకబోతుండగా స్థానికులు గమనించి ఆమెను రక్షించి పోలీసులకు అప్పగించారు. విచారణలో మనవన్ని చెరువులోకి తోసేసినట్లు వెల్లడించడంతో అగ్నిమాపక సిబ్బందితో కలసి పోలీసులు గంటకుపైగా గాలించి ప్రజ్వల్‌ మృతదేహాన్ని వెలికితీశారు. జిల్లా ఎస్పీ పరుశురామ్‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రజ్వల్‌ మృతి వార్త తెలుసుకొని తల్లి లక్ష్మీ ప్రియునితో కలిసి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని తన కొడుకును తల్లి సావిత్రమ్మే హత్య చేసిందని ఆరోపించింది. బాలుడు కాళ్లుచేతులు కట్టేసి ఉండడంతో ఎవరో కుట్రతోనే నీటిలో తోసేసి ఉంటారని,  అనుమానిస్తున్నారు. లక్ష్మీ, ఆమె ప్రియుడు విచారణ నుంచి జారుకుని వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు