ఆలయంలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

22 Jul, 2019 10:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘తనకు మరొకరితో వివాహం జరుగుతుందనే ఊహనే భరించలేకున్నాను. తను లేకుండా నేను బతకలేను. తను నాకు దూరమవుతుందనే బాధ నా గుండెను మెలిపెడుతుంది. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఉద్యోగం కూడా పోయింది... తను లేని జీవితం నాకు వద్దు. అందుకే చనిపోతున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి’ అంటూ ఆగ్రావాసి ఒకరు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

వివరాలు.. ఆగ్రాకు చెందిన శ్యామ్‌ సికార్వార్‌ అలియాస్‌ రాజ్‌(22) అనే వ్యక్తి కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. దాంతో రాజ్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఆలయానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోవడానికి గల కారణాలను ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా పంచుకున్నాడు రాజ్‌. అంతేకాక తన చావుకు ఎవరిని బాధ్యుల్ని చేయవద్దని పోలీసులను కూడా కోరాడు. దాంతో పాటు నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ను కూడా రాశాడు రాజ్‌. దానిలో తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నందుకు క్షమించమని కోరడమే కాక తన అవయవాలను దానం చేయాల్సిందిగా కోరాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు