భార్యను లవ్‌ చేయమని ప్రోత్సహించి..

19 Dec, 2019 12:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువకుడి మరణానికి కారణమైన యజమాని

అహ్మదాబాద్‌లో ఘటన, కేసు నమోదు

అహ్మదాబాద్‌: ఇదో వింత కేసు. తన భార్యను ఓ యువకుడు ప్రేమించేసేలా చేసి అతడి మరణానికి కారణమయ్యాడో భర్త. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఉదంతంపై పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

అసలేం జరిగింది?
అహ్మదాబాద్‌ గోమతిపూర్‌కు చెందిన నిఖిల్‌ పర్మార్‌ అనే 19 ఏళ్ల యువకుడు ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్‌ బలవన్మరణానికి అతడి యజమానే కారణమని తాజాగా వెల్లడైంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... వాస్నాలోని వెడ్డింగ్‌ డెకరేషన్‌ స్లపయింగ్‌ కంపెనీలో గతేడాది అక్టోబర్‌లో నిఖిల్‌ చేరాడు. పది నెలల తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్లి తన తండ్రి అశోక్‌ పర్మార్‌తో ఉద్యోగం మానేస్తానని చెప్పాడు. యజమాని, అతడి భార్య వేధిస్తున్నారని తండ్రికి గోడు వెళ్లబోసుకున్నాడు. కొడుకు అభీష్టాన్ని అశోక్‌ కాదనలేదు. ఈ ఏడాది జూలై 14న నిఖిల్‌కు యజమాని ఫోన్‌ చేసి జీతం తీసుకెళ్లమని చెప్పాడు. తర్వాతి రోజు నితిన్‌.. యజమాని వద్దకు వెళ్లాడు. తనను యజమాని రాజ​స్థాన్‌ తీసుకెళుతున్నాడని తండ్రికి తెలిపాడు. ఐదు రోజుల తర్వాత యజమాని అశోక్‌కు ఫోన్‌ చేసి తన కంపెనీ గోడౌన్‌లో ఉరేసుకుని నిఖిల్‌ అత్మహత్య చేసుకున్నాడని ఫోన్‌ చేశాడు. అతడు అక్కడికి వెళ్లేసరికి నిఖిల్‌ శవమై కనిపించాడు.  

నిఖిల్‌ ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల తర్వాత ఆశ్చకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖిల్‌ తోబుట్టువులు సంజయ్‌, నిష అతడి ఫోన్‌ను పరిశీలిస్తుండగా అందులో కీలక సమాచారం లభ్యమైంది. నిఖిల్‌ అతడి యజమానికి పంపిన మెసేజ్‌లు అందులో ఉన్నాయి. ‘మీ భార్యను ప్రేమించమని నన్ను ఆదేశించారు. మీ ఆదేశాల ప్రకారం ఆమెను ప్రేమలో పడేశాను. ఇప్పుడు ఆమె నన్ను ప్రేమిస్తోంది. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాం. ఇప్పుడేమో మాట మార్చి రిలేషన్‌షిప్‌ను వదులుకోమంటున్నారు. నన్ను బెదిరించడమే కాకుండా జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. దయచేసి నన్ను మీ బానిసలా చూడొద్దు. నా మీద దయ చూపండి’ అంటూ యజమానికి పంపిన మెసేజ్‌లో నిఖిల్‌ వేడుకున్నాడు.

తన కంటే 20 ఏళ్లు చిన్నదైన భార్య(25)తో సంబంధం పెట్టుకోవాలని యజమాని(45) నిఖిల్‌ను ప్రోత్సహించాడు. తర్వాత వద్దన్నాడు. ఈ విషయాన్ని నిఖిల్‌ తన యజమాని భార్యతో చెబితే ఆమె చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అతడిని దూషించింది. తనతో సంబంధం కొనసాగించాలని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే తన భార్యకు దూరంగా ఉండాలని యజమాని హెచ్చరించాడు. వీరిద్దరి మధ్య నలిగిపోయిన నిఖిల్‌ చివరకు ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు