ఆళ్లగడ్డ పోలీసుల అదుపులో అఖిలప్రియ అనుచరులు

22 Oct, 2019 12:34 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

బంజారాహిల్స్‌: వ్యాపారిపై హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు ముగ్గురిని ఆళ్లగడ్డ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 27న దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వ్యాపారి శివరాంరెడ్డి క్రషర్‌ వద్దకు దౌర్జన్యంగా ప్రవేశించడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అఖిలప్రియ భర్త భార్గవ రామానాయుడు  ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఈ కేసులో మరో పది మందిపై ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆళ్ల సుబ్బయ్య, వినయ్, మంగళి పవన్‌ పరారీలో ఉన్నారు. వీరు నగరంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆళ్లగడ్డ పోలీసులు సోమవారం నగరానికి చేరుకున్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఇంట్లో ఉన్న నిందితులను గుర్తించిన వీరు బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. దీనిని గుర్తించిన నిందితులు అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్‌తో కలిసి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి  లొంగిపోయారు. దీనిపై ఆళ్లగడ్డ పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితులను అదుపులోకి తీసుకొని ఆళ్లగడ్డకు తీసుకెళ్లారు.

>
మరిన్ని వార్తలు