ఆ కిరాతకుడు అతి కిరాతకుడే..!

8 Jun, 2019 12:13 IST|Sakshi

అలీగఢ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితుల్లో ఒకరైన జహీద్‌ సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడని, బెయిల్‌పై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాజా కేసుతో కలిపి మొత్తం అతనిపై నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక నిందితులు జహీద్‌, అస్లాంను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్‌ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్‌ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
(పాశవిక హత్యపై ప్రకంపనలు)

రూ. 10 వేల కోసం దారుణం..
టప్పల్‌ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్‌ శర్మ టప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్‌ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్‌ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు