ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!

22 May, 2019 16:40 IST|Sakshi

జైపూర్‌ : ఆళ్వార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నఇండోర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దుండగులు అనంతరం ఆమెను హత్యచేసి పరారయ్యారు. వివరాలు.. ఆళ్వార్‌కు చెందిన అంజు యాదవ్‌, భర్త జితేంద్ర యాదవ్‌, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆదివారం రాత్రి రైలు ప్రయాణం చేస్తోంది. కుమారుడితో కలిసి ఆమె 25వ బెర్త్‌పైన నిద్రించగా.. జితేంద్ర 28వ బెర్త్‌పైన నిద్రిస్తున్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో వారి కుమారుడు ఏడ్వడవంతో జితేంద్ర అక్కడికి వచ్చి చూడగా.. అంజు లేదు. దీంతో బోగిలోని వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా.. ఆమె శవమై కనిపించింది. ట్రైన్‌ గార్డుని సంప్రదించడానికి ప్రయత్నించగా వీలుపడలేదు.

దీంతో చైన్‌లాగి రైలుని ఆపాడు. ఘటనస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని చిత్తోర్‌ఘర్‌ పోలీస్‌స్టేషన్‌కు అక్కడి నుంచి పోస్టుమార్టంకు తరలించారు. ‘నా కొడుకు ఏడుపు విని నిద్రలేచాను. అక్కడికి వెళ్లి చూడగా అంజు లేదు. వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా.. చనిపోయి ఉంది. దుప్పట్టాతో ఆమె మెడకు ఉరి బిగించి ఎవరో హత్య చేశారు. ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారు’ అని జితేంత్ర కన్నీరుమున్నీరయ్యాడు. అంజు ఒంటిపై ఉన్న నగల్ని దోచుకున్న దొంగలు అనంతరం ఆమెను హతమార్చి ఉంటారని చిత్తోర్‌ఘర్‌ ఎస్‌ఐ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగతుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు