ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!

22 Jun, 2020 09:03 IST|Sakshi

ఈఎస్‌ఐ మందుల సరఫరా వ్యవహారంలో కోదాడకు లింకులు

కుంభకోణంలో ఏ–3 నిందితుడిగా కోదాడ వాసి ప్రమోద్‌రెడ్డి

ఆదివారం రహస్య విచారణ చేసిన ఆంధ్రా ఏసీబీ అధికారులు

కోదాడ : ఆంధ్రాలో ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? )

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్‌ స్విచ్‌     ఆఫ్‌ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’)

మరిన్ని వార్తలు