గాజులు పెట్టించుకోవడానికి వెళ్లి..

17 Mar, 2018 09:04 IST|Sakshi
దారావత్‌ గీత(ఫైల్‌)

అనుమానాస్పద స్థితిలో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని కొండపూర్‌ శివారు మల్లన్నగుట్ట తండాకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ దారావత్‌ గీత(26) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గీత గురువారం సాయంత్రం తన ఆడబిడ్డలతో కలిసి కొండపూర్‌లో గాజులు పెట్టుకోవడానికి వెళ్లింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గురువారం రాత్రి గ్రామ శివారులోని రోడ్డుపై గీత కింద పడి రక్తం మడుగులో ఉంది. విషయాన్ని గమనించిన కొందరు భర్త భోజ్యానాయక్‌కు తెలిపారు. భోజ్యానాయక్‌ సంఘటన స్థలానికి వెళ్లి గీతను చేర్యాలలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిఖిల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం గీత మృతి చెందింది. మృతురాలికి భర్త, మగ్గురు కుమారైలు ఉన్నారు. గాజుల దుకాణం వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను ఇంటి వద్ద దింపుతానని బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లి తలపై బండతో కొట్టి చంపాడని మృతురాలి భర్త భోజ్యానాయక్‌ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని మద్దూరు ఎస్‌ఐ ఎన్‌ వీరేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు