మళ్లీ పోలీసుల వద్దకు ఉపేంద్ర బాధితురాలు

13 Jun, 2018 21:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మయూర్‌ పాన్‌ షాప్‌ యజమాని ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయానంటూ ఫిర్యాదు చేసిన బాధితురాలు బుధవారం మరోమారు పోలీసులను ఆశ్రయించారు. తనపై ఉపేంద్ర వర్మ సోదరుడు చేస్తోన్న ఆరోపణల్లో నిజంలేదని, ఆ కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఏసీపీ షికా గోయల్‌కు మొరపెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినందుకే ఉపేంద్రను నమ్మానని చెప్పారు.

‘‘ఉపేంద్ర సోదరుడు ఆరోపిస్తున్నట్లు నేనేమీ ప్రీతి(ఉపేంద్ర భార్య)తో గొడవపడలేదు. బ్లాక్‌ మెయిల్‌ అంతకన్నా చేయలేదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే న్యాయం కోసం ఆ ఇంటికి వెళ్లాను. ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీసి నన్ను బద్నామ్‌ చేస్తున్నారు. నా కాలేజ్‌ ఫ్రెండ్‌ ఒకరితో చనువుగా ఉండేదాన్ని. కానీ మనస్పర్థలు రావడంతో మేం విడిపోయాం. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన ఉపేంద్రపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని బాధితురాలు చెప్పారు.

బాధితురాలిపై ఆరోపణలు: మయూర్‌ పాన్‌ షాప్‌ యజమాని ఉపేంద్ర వర్మపై బాధితురాలు ఫిర్యాదు చేసిన కొద్ది గంటలకే ఉపేంద్ర సోదరుడు మీడియా ముందుకొచ్చారు. తమపై ఫిర్యాదు చేసిన అమ్మాయికి ఇంతకుముందే చాలామంది అబ్బాయిలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ, సంబంధిత వీడియోలు బయటపెట్టారు. బ్లాక్‌ మెయిల్‌ కూడా చేసినట్లు తెలిపారు. సదరు ఆరోపణల్లో వాస్తవం లేదని, తన ప్రాణాలకు హాని ఉందని బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.
(చూడండి: అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..)

మరిన్ని వార్తలు