ఫామ్‌ హౌస్‌లో యువతీయువకుల చిందులు

5 May, 2019 15:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి మరో మారు వార్తల్లోకి ఎక్కింది. అక్కడి ఫామ్‌ హౌస్‌లో మత్తుకి చిత్తయిన యువత, యువతులతో నృత్యాలు, ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వెరసి ఆ పరిసర వాసుల్ని ఆందోళనలో పడేసింది. రంగంలోకి దిగిన పోలీసులు 159 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. వారి వద్ద విచారిస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలోని ఓ ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు సాగించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. స్నేహం ముసుగులతో యువతులు, విద్యార్థినులను తీసుకెళ్లి లొంగ దీసుకోవడం, ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించడం, బెదిరించడం, లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చిన ఈ మానవ మృగాళలో కొందర్ని అరెస్టు చేసి ఉన్నారు.

ఈ వ్యవహారం సీబీఐ విచారణకు సైతం చేరింది. అయితే, పొల్లాచ్చి పరిసరాల్లోని ఫామ్‌ హౌస్‌ల నిర్వాహకులు ఏ మాత్రం తగ్గడం లేదు. విందులు, వినోదాలు, యువతులతో అసభ్య నృత్యాలను హోరెత్తిస్తూ వస్తున్నాయి. పొల్లాచ్చి సీతమడై అటవీ ప్రాంతాల్లో ఉన్న ఓ ఫామ్‌ హౌస్‌లో కోయంబత్తూరుకు చెందిన యువకుల్ని, కేరళకు చెందిన యువకుల్ని ఆకర్షించే రీతిలో కొంత కాలంగా నైట్‌ పార్టీలు హోరెత్తుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే వాళ్లు లేరని చెప్పవచ్చు.

మత్తులో వీరంగం...
ఆన్‌లైన్‌లో పేర్లు, వివరాలను నమోదు చేసుకుని మరీ యువత పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ నిమిత్తం ఆఫామ్‌ హౌస్‌కు వెళ్లారు. శనివారం  ఉదయం వరకు ఇక్కడ విందు, వినోదం, యువతులతో నృత్యాలు హోరెత్తాయి. యువతే కాదు, అనేక మంది ఆ పరిసర కళాశాలలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు సైతం ఇక్కడికి వెళ్లడం గమనార్హం. మత్తుకు చిత్తయిన రెండు వర్గాలు హఠాత్తుగా నృత్యాలు చేస్తున్న యువతుల విషయంగా ఢీకొట్టినట్టు సమాచారం. దీంతో ఆయువతుల కోసం రెండు వర్గాలు తలబడడం రగడకు దారి తీసింది. ఇక్కడ సాగుతున్న వీరంగాలతో ఆ పరిసర వాసుల్లో ఆగ్రహం రేగింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం శూన్యం. చివరకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి, మీడియా వర్గాలకు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు పరుగులు తీశారు.

అక్కడకు వెళ్లి చూడగా, మత్తులో తూలుతున్న వాళ్లే మరీ ఎక్కువ. అనేక చోట్ల కొన్ని రకాల మాత్రలు, కొన్ని రకాల ప్యాకెట్లు పడి ఉండడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. అక్కడున్న 159 మంది విద్యార్థులు, యువతను అరెస్టు చేసి సమీపంలోని ఓ కల్యాణ మండపంకు తరలించారు. విద్యార్థినులు, యువతులను రహస్యంగా బయటకు పంపించేశారు. పట్టుబడ్డ వారిలో కోయంబత్తూరు, కేరళలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరి వద్ద పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఆ ఫాంహౌస్‌ నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. ఫాంహౌస్‌ మేనేజర్‌ నరేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు