నల్లగొండలో మరో హత్య ; తల నరికి జెండాదిమ్మెపై..

29 Jan, 2018 09:44 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : వరుస దారుణకాండలు నల్లగొండ జిల్లాలో కలకలంరేపుతున్నాయి. కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మర్డర్‌ కేసు మరువకముందే మరో వ్యక్తి అతిదారుణంగా హత్యకుగురయ్యాడు. సోమవారం ఉదయం నల్లగొండ పట్టణం బొట్టుగూడలోని ఓ జెండాదిమ్మెపై తెగిపడిన తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తల పాలకూరి రమేశ్‌దిగా పోలీసులు గుర్తించారు.

ఎవరు చేశారీ ఘాతుకం?: హతుడు రమేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న అతను.. మందుతు తెచ్చుకుంటానని ఇంట్లోవాళ్లకు చెప్పి ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ను కిరాతకంగా చంపి, తలను, మొండెంను వేరుచేశారు. అనంతరం తలను తీసుకొచ్చి బొట్టుగూడలోని జెండాదిమ్మెపై ఉంచివెళ్లారు. సమాచారం తెలిసన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాడ్‌స్క్వాడ్‌ సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక్కడి భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద రమేశ్‌ మొండేన్ని గుర్తించారు. ఈ హత్యచేసింది ఎవరు, ఇందుకు దారితీసిన పరిస్థిలేమిటనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధమే రమేశ్‌ మరణానికి కారణమై ఉంటుందని తెలిసింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణకావాల్సిఉంది.

కొద్ది రోజుల కిందటే నల్గొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురికావడం రాజకీయంగా కలకలంరేపింది. అధికార పార్టీకి చెందిన గుండాలే నిందితులని విపక్ష కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. శ్రీనివాస్‌ హత్య కేసులో నిదితులను పోలీసులు అరెస్టుచేశారు. ఒకప్పుడు క్రైమ్‌ డెన్‌గా ఉన్న నల్లగొండలో కొంతకాలంగా ప్రశాంత నెలకొంది. కానీ వరుస హత్యాకాండలు మళ్లీ పాతరోజులను గుర్తుచేస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

మరిన్ని వార్తలు