బావ కిరాతకం

21 Feb, 2019 12:02 IST|Sakshi
నిందితులు వివేక్‌ ప్రతాప్, థాయ్‌హేల్‌ హత్యకు గురైన అనూషా (ఫైల్‌)

ఇంటి స్థలం కోసమే  అనూషా హత్య

సెక్యూరిటీ గార్డు సాయంతో దారుణం

యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు

యశవంతపుర: ఇటీవల కెంగేరి సమీపంలోని సన్‌సిటీలో హత్యకు గురైన వివాహిత అనూషా హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిస్థలం కోసం మరదలును దారుణంగా హత్య చేసినట్లు బావ వివేక్‌ప్రతాప్‌ అగర్వాల్‌తో పాటు అరుణాచలప్రదేశ్‌కు చెందిన థాయ్‌హేల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు కోల్‌కతాకు చెందిన వివేక్‌ ప్రతాప్‌ అగర్వాల్‌ నేత్రావతిని వివాహం చేసుకుని కెంగేరి ఉపనగర సన్‌సిటీలో నివాసం ఉంటున్నారు. తన భార్య నేత్రావతి వద్దనున్న బంగారు అభరణాలను తాకట్టుపెట్టి ఆ నగదును షేర్‌ మార్కెట్‌లో పెట్టాడు. అది దివాళా తీయడంతో మళ్లీ డబ్బులు కావాలంటూ అత్తమామలను వేధించటం మొదలు పెట్టాడు. మరదలు అనుషా పేరుపై బిడిది వండర్‌లా సమీపంలో ఇంటిస్థలం ఉంది దానిని భార్య నేత్రావతి పేరుపై రాసి ఇవ్వాలని అత్తమామలపై ఒత్తిడి పెంచాడు. విషయం మరదలు అనుషా ఎట్టి పరిస్థితుల్లోను తాను ఇంటి స్థలం రాసి ఇచ్చేది లేదని తెల్చి చెప్పింది.

తన భార్య పేరుపై స్థలం రాసివ్వకపోతే హత్య చేస్తానని బెదిరించాడు. ఇంటి స్థలం దక్కదని భావించిన వివేక్‌ మరదలును హత్య చేయడానికి పథకం వేశాడు. తనకు పరిచయం ఉన్న సెక్యూరిటీ గార్డు థాయ్‌హేల్‌ సహాయం తీసుకున్నాడు. ఒక రాత్రి సహాయం చేస్తే రూ. లక్ష ఇస్తానని మాట ఇచ్చాడు. అతడికి పీకలదాక మద్యం తాపించాడు. మరుసటి రోజు మరదలు అనూషా ఉంటున్న కెంగేరి ఉపనగర సన్‌సిటీ 14వ క్రాస్‌ ఇంటిని చూపించాడు. భర్త సనత్‌ విధులకు వెళ్లిన సమయంలో థాయ్‌హేల్‌తో పాటు ఈనెల 18న అర్ధరాత్రి అనూషా ఇంటికి వచ్చిన వివేక్‌ ఎలాగో తలుపు తీయించి లోనికి వెళ్లాడు. ముందుగానే తెచ్చుకున్న తాడుతో ఇద్దరు కలిసి అనూషా గొంతు బిగించి హత్య చేశారు. ఎవరూ గుర్తించకుండా తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు. మరుసటి రోజు భర్త సనత్‌ ఫోన్‌ చేసినా స్పందింకపోవడంతో అదే మేడపై ఉన్న తన అక్కకు ఫోన్‌ చేసి చూడమని చెప్పాడు. ఆమె వచ్చి చూడగా హత్యకు గురైనట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం అనూషా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేపట్టిన కెంగేరి పోలీసులు విచారణ చేపట్టి ఇంటి స్థలం కోసమే అనూషాను వివేక్, థాయ్‌హేల్‌ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు