చిట్యాల పశువైద్యశాల ఎదుట బాధితుల ఆందోళన

12 Jun, 2018 13:18 IST|Sakshi
పశువైద్యశాల ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు 

అటెండర్‌ మోసం చేశాడని ఆవేదన  

చిట్యాల(నకిరేకల్‌) :  చిట్యాల పశువైద్యశాలలో పనిచేసిన అటెండర్‌ సబ్సిడీ పరికరాలు ఇప్పిస్తామని, పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని రైతులు, పశువుల పెంపకందారుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఊడాయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు చిట్యాల పశువైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు.

చిట్యాల పశువైద్యశాలలో ఆరు నెలల క్రితం వరకు అటెండర్‌గా పనిచేసిన కిరణ్‌ మండలంలోని పదిమంది రైతుల వద్ద నుంచి సబ్సిడీపై ఇచ్చే గడ్డికోసే యంత్రాలను ఇప్పిస్తానని ఒక్కొక్క రి వద్ద నుంచి రూ.11 వేల చొప్పున వసూలు చే శాడు. అంతేకాకుండా సబ్సిడీపై కోళ్లు ఇప్పిస్తానని మరికొందరి దగ్గర నుంచి రూ. 15 వేలు వసూలు చేశాడు.

పదుల సంఖ్యలోని రైతులకు చెందిన పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ఒక్కోక్క పశువుకు రూ.290 చొప్పున వసూలు చేశాడు.  డబ్బులు వసూలు చేసి పరికరాలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత అకస్మాత్తుగా వేరే గ్రా మానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు.

దీంతో కొద్దిరోజులుగా బాధితులు స్థానిక పశువైద్యాధికారి అమరేందర్‌కు తెలియజేసి తగిన న్యాయం చేయాలని కోరారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్యాల పశువైద్యాధికారి మరో రెండు మూడు రోజుల్లో బదిలీ కానున్నట్లు తెలియడంతో సోమవారం బాధితులు పశువైద్య శాల ఎదుట నిరసనకు దిగారు.

అటెండర్‌ వద్ద నుంచి తమకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు పశువుల డాక్టర్‌ను కోరారు. కాగా గడ్డి యంత్రం కోసం డబ్బులు ఇచ్చిన వారిలో చిట్యా ల జెడ్పీటీసీ శేపూరి రవీందర్‌ సైతం రూ.4వేలు ఇవ్వడం కొస మెరుపు.

పశువైద్యాధికారి వివరణ 

అటెండర్‌ కిరణ్‌ గత ఆక్టోబర్‌ నెలలో బదిలీపై వేరే పశువైద్యాశాలకు వెళ్లాడని చిట్యాల పశువైద్యాధికారి జెల్లా అమరేందర్‌. పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తనకు తెలిపారని, అతనితో ఫోన్‌లో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించిన అందుబాటులోకి రావడం లేదన్నారు. జరిగిన విషయాన్ని పైఅధి కారులకు తెలియజేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు