రఘు అత్త పేరుతో ‘అనంత’లో 75 ఎకరాలు

4 Oct, 2017 01:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ వెంకటరఘుకు సంబంధించిన బినామీ ఆస్తులు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. రఘు బినామీ పేరుతో అనంతపురం జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్న పొలాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌కు ఆనుకుని మెదక్‌ జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలోని పాటి గ్రామంలో ఆరెకరాల పొలం ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో 75 ఎకరాల పొలం పత్రాలు రఘు అత్త బసివిరెడ్డి కళావతమ్మ పేరుతో లభ్యమయ్యాయి. వీటిని ఆమె పేరుతోనే ఎస్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా అనే బోగస్‌ కంపెనీలో పెట్టుబడులుగా చూపించినట్లు తేలిందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగా, మరిన్ని వివరాలు రాబట్టేందుకు రఘును నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు.. విశాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రఘు బినామీలు నల్లూరి శివప్రసాద్, ఆయన భార్య గాయత్రిని కూడా 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు