పార్థి గ్యాంగ్‌ తిరుగుతుందట నిజమేనా సారూ?

22 May, 2018 10:21 IST|Sakshi
హుస్నాబాద్‌ ఎల్లం బజార్‌లో మహిళలతో మాట్లాడుతున్న సీపీ  

పార్థి గ్యాంగ్‌ తిరుగుతుందట నిజమేనా?

సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ ఎదుట ఓ మహిళ ఆందోళన

అదేమీ లేదమ్మా, అదంతా ఉత్త వదంతే అన్న సీపీ

మీ భద్రత బాధ్యత మాది అంటూ భరోసా

హుస్నాబాద్‌ మెదక్‌ : సారూ మా పిల్లలు పదిలమేనా?, పార్థి గ్యాగ్‌ తిరుతుందంట నిజమేనా? అని హుస్నాబాద్‌ ఎల్లం బజార్‌కు చెందిన ఓ మహిళ కార్డున్‌ సెర్చ్‌ పర్యవేక్షించడానికి వచ్చిన సీపీ జోయల్‌ డేవిస్‌ ఎదుట తన భయం వ్యక్తం చేసింది. గ్రామాల్లో పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది నిజమేనా సారు? గుంపుల కొద్ది పోలీసులు వస్తే భయమైతాంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

స్పందించిన సీపీ జోయల్‌ డేవీస్‌ అదేమి లేదమ్మా అలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. మీ ఫోన్లలో వాట్సాప్‌కు వచ్చిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని సదరు మహిళను ప్రశ్నించారు. తమ వద్ద ఫొటోలు లేవని అందరు అనుకుంటున్నారని ఆమె బదులిచ్చింది. హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లంబజార్‌లో సోమవారం ఉదయం పోలీసులు కార్డూన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పిల్లలను ఎత్తుకు పోయేందుకు పార్థి గ్యాంగ్‌ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీస్‌ల వద్ద లేవని స్థానిక మహిళలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మొద్దని సూచించారు.

మీ రక్షణకు మేము ఉన్నామని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మా పోలీసుల బాధ్యత అని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై మా ప్రత్యేక పోలీస్‌ల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. సీపీ వెంట అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్, సీఐలు శ్రీనివాస్‌జీ, రఘు, ఎస్‌ఐ సుధాకర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు