నౌహీరా కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

23 Oct, 2018 20:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరా గ్రూప్‌ సీఈఓ నౌహీరా షేక్‌ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. నౌహీరాకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు నాయవాది తధాని వాదనలు వినిపించారు. హీరా గ్రూప్‌కు సంబంధించి 2012 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తోందని.. అయిన ఇప్పటివరకు ఈడీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. డిపాజిట్‌ దారుల సౌలభ్యం కోసమే 160 బ్యాంక్‌ ఖాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఆదాయ లావాదేవీలు సక్రమంగా జరుపుతున్నామని.. ఐటీ రిటన్స్‌ కూడా చెల్లిస్తున్నామని కోర్టులో వాదనలు వినిపించారు. తమపై ఉద్దేశ పూర్వకంగానే కేసులు నమోదు చేశారని తధాని కోర్టుకు తెలిపారు.

పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఇప్పటికే నౌహీరాపై అనేక చోట్ల కేసుల నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ఆమెను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది హీరా గ్రూప్‌ బాధితులు ఉన్నారని, విచారణ కొనసాగుతోందని, బాధితుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

చదవండి: 6 సంవత్సరాలు..800 కోట్లు!

              ‘స్కీమ్స్‌’ స్కామ్‌లో డాక్టర్‌ నౌహీరా షేక్‌ అరెస్టు

మరిన్ని వార్తలు