బీహార్‌లో దోపిడి దొంగల బీభత్సం; ఒకరి మృతి

13 Nov, 2019 12:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : బిహార్‌లోని బేగుసారయి జిల్లాలో మంగళవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే గాక ఇద్దరు నగల వ్యాపారలును గాయపరిచి రూ. 25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ​ఈ ఘటన రాత్రి  తొమ్మిది గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దాడిలో చనిపోయిన డ్రైవర్‌ను దీపక్‌కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు.

బేగుపారయి డీఐజీ రాజేశ్‌ కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగుసారయికి చెందిన ప్రిన్స్‌ సోనీ, అభయ్‌ కుమర్‌ సింగ్‌, సంతోష్‌ కుమార్‌లు నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకొనిహోల్‌సేల్‌గా  బంగారం కొందామని మంగళవారం  కోల్‌కతాకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో కోల్‌కతా నుంచి బరౌని వరకు రైళ్లో వచ్చిన వీరు అక్కడి నుంచి బేగుసారయి వెళ్లడానికి దీపక్‌ కుమార్‌కు చెందిన ఎస్‌యూవీ కారులో బయలుదేరారు.

ఠాకూరిచౌక్‌ వద్దకు రాగానే అప్పటికే మాటు వేసిన దోపిడి దొంగలు కారును అడ్డుకొని  వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆభరణాలు ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పులల్లో కారు నడుపుతున్న డ్రైవర్‌ దీపక్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సంతోష్‌, సోనీలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 25 కోట్లు వరకు ఉన్నట్లు తెలిసింది.

కాగా, దీపక్‌కుమార్‌ మృతదేహానన్ని పోస్టుమార్టంకు తరలించామని.. గాయపడిన సంతోష్‌, సోనీలను బేగుసారయిలోని ఆసుపత్రికి తరలించినట్లు డీఐజీ పేర్కొన్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే గాక, ఒకరి మృతికి కారణమైన దుండగులపై ఐపీసీ సెక్షన్‌ 302, 307, 395 కింద గర్హారా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే దుండగులు వారిని ఉదయం నుంచే వెంబడిస్తూ పక్కా ప్లాన్‌ ప్రకారమే చేశారా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు