కంటోన్మెంట్‌ ఏరియాలో కలకలం

24 Jun, 2018 08:27 IST|Sakshi
ఘటనాస్థలంలో పోలీసులు, మీడియా

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని శివారులో కలకలం రేగింది. ఓ ఆర్మీ అధికారి భార్య హత్య ఉదంతం కంటోన్మెంట్‌ ప్రాంతంలో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. నైరుతి ఢిల్లీలోని బ్రార్‌ స్క్వేర్‌ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్‌లో మృతి చెందింది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించారు. దీంతో హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

30 ఏళ్ల సదరు మహిళ స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి ఫిజియోథెరపీ సెషన్‌ కోసం వెళ్లారు. ఆమె భర్త మేజర్‌ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్‌ ఆస్పత్రి వద్ద డ్రాప్‌ చేశాడు. అయితే అరగంట తర్వాత ఆమె ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.  ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. ముందు ఆమెను హత్య చేసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మేజర్‌కు సమాచారం అందించిన పోలీసులు.. మృత దేహాం ఆయన భార్యదేనని నిర్ధారించారు. ఆపై పోస్టు మార్టానికి మృతదేహాన్ని తరలించి కేసును నమోదు చేసుకున్నారు. ఫోన్‌ కాల్‌ లిస్ట్‌, సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మిస్టరీని చేధించే పనిలో పడ్డారు.

ఆర్మీ మేజర్‌ అరెస్ట్‌... ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ అందింది. ఈ కేసుకు సంబంధించి ఇండియన్‌ ఆర్మీ మేజర్‌ నిఖిల్‌ హందాను మీరట్‌లోని దౌరాలాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు