లైంగిక దాడి కేసులో భర్త, అతని స్నేహితుడి అరెస్ట్‌

5 Dec, 2019 04:39 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ షేక్‌లాల్‌ అహ్మద్‌

కదిరి అర్బన్‌:  భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. అట్ల కాడతో మర్మాంగాలపై వాతలు పెట్టిన కేసులో భర్త, అతని స్నేహితుడిని కదిరి రూరల్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ షేక్‌ లాల్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందిన డి.మల్లేశ్వర్‌ నవంబర్‌ 29న తన స్నేహితుడు విజయ్‌కుమార్‌తో కలిసి ఇంటికి వెళ్లాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం అట్ల కాడ కాల్చి మర్మాంగాలపై వాతలు పెట్టాడు.

ఈ అమానవీయ ఘటనపై బాధితురాలు మరుసటి రోజు తలుపుల మండలం సిద్దగూరుపల్లిలోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. వారి సహాయంతో ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన భర్త డి.మల్లేశ్వర్, అతని స్నేహితుడు విజయ్‌కుమార్‌ను మంగళవారం అర్ధరాత్రి కుటాగుళ్ల క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేశారు.

బాధితురాలు తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఘటన జరిగిన ప్రాంతం కదిరి రూరల్‌ పరిధిలోనిది కావటంతో అక్కడకు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎస్పీ పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయగానే.. తలుపుల ఎస్సై రఫీ ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, ఆస్పత్రిలో కదిరి రూరల్‌ పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని కేసు నమోదు చేశారని వివరించారు. 

మరిన్ని వార్తలు