హరియాణ గ్యాంగ్‌ రేప్‌ : వైద్యుడి ప్రమేయం

17 Sep, 2018 10:35 IST|Sakshi

చండీగఢ్‌ : హరియాణలో సీబీఎస్‌ఈ టాపర్‌, 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుడిని పిలిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నిషు పొగట్‌ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించి డాక్టర్‌ సంజీవ్‌ అనే వైద్యుడిని రప్పించాడని పోలీసులు వెల్లడించారు. డాక్టర్‌ సంజీవ్‌తో పాటు లైంగిక దాడి జరిగిన రూమ్‌ యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీనేజర్‌పై లైంగిక దాడి కేసులో వైద్యుడి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితురాలిపై నిందితులు దారుణానికి ఒడిగట్టినా డాక్టర్‌ సంజీవ్‌ పోలీసులకు సమాచారం అందించలేదని చెబుతున్నారు. లైంగిక దాడి జరిగే సమయంలో ఆయన అక్కడే ఉన్నా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఈ ఘోరంలో పాలుపంచుకున్నాడని ఆధారాలున్నాయని, ఫోరెన్సిక్‌ ఫలితాల్లో ఇది వెలుగుచూస్తుందని పోలీస్‌ అధికారి నంజీన్‌ భాసిన్‌ చెప్పారు. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌తో సహా మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

కనియా జిల్లాలో కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు.మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది.

మరిన్ని వార్తలు