ఆర్టిస్ట్రీ పబ్‌ ఘటనలో ఇద్దరి అరెస్ట్‌

5 Dec, 2019 15:38 IST|Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు.. ఇన్‌సెట్‌లో ఆశిష్‌ గౌడ్‌(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్‌ చేసినట్లు మాదాపూర్‌ సీఐ వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న  పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశిష్‌ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్‌–2  కంటెస్టెంట్‌ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్‌ గౌడ్‌ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్‌ అలియాస్‌ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్‌ కుమార్‌ గౌడ్‌ను బుధవారం అరెస్ట్‌ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్‌ గౌడ్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.

కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్‌ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్‌ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్‌ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్‌ గౌడ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం 

మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సంజన

ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్‌ గౌడ్‌

మరిన్ని వార్తలు