మహిళ మెడ నరికి హత్య

14 Nov, 2019 03:51 IST|Sakshi

హయత్‌నగర్‌: దుండగులు ఓ మహిళ మెడ నరికి దారుణంగా హత్యచేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుంట్లూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. కుంట్లూర్‌ శివారులో నాగోలు వెళ్లే దారిపక్కన దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గమనించగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ మెడ నరికి చంపినట్లు గుర్తించారు.

ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి మృతురాలిని మెదక్‌ జిల్లా జోగిపేట మండలం యారారం గ్రామానికి చెందిన బేతమ్మ అలియాస్‌ లింగమ్మగా, ఆమె వయసు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు రెండు రోజుల కిందట హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, డైరీలు, మద్యం సీసాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు