కలకలం రేపుతోన్న తలలేని మహిళ మృతదేహం

20 Jun, 2019 11:21 IST|Sakshi

దిస్పూర్‌ : ప్రముఖ కామాఖ్యా దేవి ఆలయం సమీపంలో బుధవారం తలలేని మహిళ మృతదేహం(మొండెం) పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. క్షుద్ర పూజల్లో భాగంగా బలిచ్చారా లేక స్వయంగా ప్రాణ త్యాగం చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం సమీపంలో మృతదేహాన్ని కనుగొనడంతో ప్రాణత్యాగం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం చుట్టుపక్కల మట్టి ప్రమిద, కుండ, పూజ నిమిత్తం ఉపయోగించే ఎరుపు దారం, ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ వంటి వస్తువులను పోలీసులు గుర్తించారు.

ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘మృత దేహం దగ్గర లభ్యమైన వస్తువులన్నింటిని పూజా కార్యక్రమాల కోసమే వినియోగిస్తారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నూనె తీసుకువచ్చారేమో అనిపిస్తుంది. అంతేకాక మృతురాలి శరీరం మీద దాడి చేసినట్లు, పెనుగులాడినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ప్రాథమిక రిపోర్టులో తెలిసింది. ఇక ఈ ప్రాంతంలో అనుమానాస్పాదంగా ఎలాంటి కేకలు, అరుపులు వినపడలేదని స్థానికులు తెలిపారు. అంటే మృతురాలు స్వయంగా ప్రాణత్యాగం చేసి ఉండాలి.. లేదంటే ఎవరైనా ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉండాలి. ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు సాగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు