వివాహిత దారుణ హత్య

7 Mar, 2020 08:25 IST|Sakshi
పాల కోసం ఏడుస్తున్న చైతు,భర్త శ్రీకాంత్‌తో అంజలి (ఫైల్‌)

భర్త, కుటుంబ సభ్యులే హత్య చేశారని

మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ  

ఘటనా స్థలాన్ని పరిశీలించిన మల్కాజిగిరి డీసీపీ 

జవహర్‌నగర్‌: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురైన సంఘటన జవహర్‌నరగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌కాలనీ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, మందాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు కోహెడ మండలం, చెంచాచేరు పల్లి గ్రామానికి చెందిన అంజలి(22)తో 2018లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన శ్రీకాంత్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల పాటు జవహర్‌నగర్‌లో తన అన్న శ్రీనివాస్, వదినలతో కలిసి ఉన్న శ్రీకాంత్‌ 25 రోజుల క్రితం ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కాలనీలోని ఇంట్లోకి వెళ్లాడు. గురువారం రాత్రి అతను క్యాబ్‌ తీసుకుని బయటికి వెళ్లగా అంజలి తన కుమారుడు చైతును శ్రీకాంత్‌ సోదరుడి ఇంట్లో వదిలి, తన ఇంటికి వచ్చింది. 

శుక్రవారం ఉదయం సోదరుడి ఇంట్లో ఉన్న కుమారుడిని తీసుకుని తన ఇంటి వచ్చిన శ్రీకాంత్‌  అంజలి హత్యకు గురై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్వాడ్, క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కాగా జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా శ్రీకాంత్‌ సోదరుడి ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత  పరిశీలించారు. భర్త శ్రీకాంత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు