ఏటీఎం కార్డు కాజేసి నగదు అపహరణ

8 Sep, 2018 12:59 IST|Sakshi
బ్యాంకు పత్రాలు పరిశీలిస్తున్న ఎస్సై తారకేశ్వరరావు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

పోలీసులకు ఫిర్యాదు చేసినబాధితురాలు

విజయనగరం, గజపతినగరం: ఏటీఎం కార్డు కాజేసి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని పాతరోడ్డులో నివాసముంటున్న శంకరరావు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతని కుమార్తె మౌలి పాత నోట్ల మార్పిడి సమయంలో కొంత సొమ్ము తన ఖాతాలో జమ చేసింది.  అప్పటి నుంచి బ్యాంక్‌ ఖాతాను నిర్వహించకుండా వదిలేసింది. ఇటీవల ఏటీఎం కార్డుకు దరఖాస్తు చేయడంతో కార్డు వచ్చింది. దీంతో కార్డును ఇన్‌స్టాల్‌ చేయడానికి నెల రోజుల కిందట పట్టణంలోని ఏటీఎంకు వెళ్లింది. ఇన్‌స్టాల్‌ చేసే విషయమై అవగాహన లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ యువకుడికి కార్డు ఇచ్చి ఇన్‌స్టాల్‌ చేయమని కోరగా, అతడు ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లు నటిస్తూ తన దగ్గరున్న మరో కార్డును ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది గమనించిన బాధితురాలు ఏటీఎం కార్డును ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఆ మరుచటి రోజు బొండపల్లి ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 40 వేలు అగంతకుడు డ్రా చేశాడు. అలాగే మరో 40 వేల రూపాయలను బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే డబ్బులు అవసరం వచ్చి మౌలి ఏటీఎంకు వెళ్లి మినీ స్టేట్‌మెంట్‌ తీయగా డబ్బులు డ్రా అయినట్లు గుర్తించింది. వెంటనే బ్యాంక్‌ అధికారులతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు