దాడి చేసి.. డబ్బులు దోచేసి..   

31 Aug, 2018 09:00 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాము  

గ్యాస్‌ ఏజెన్సీ క్యాషియర్‌పై దాడి

రూ. 6.70 లక్షలతో ఉడాయింపు

రాజేంద్రనగర్‌ : గుర్తుతెలియని దుండగులు ఓ గ్యాస్‌ ఏజెన్సీ క్యాషియర్‌పై దాడి చేసి రూ. 6.7లక్షలు దోచుకుపోయారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన రాము(23) రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో ఉన్న భార్గవి గ్యాస్‌ ఏజెన్సీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం వచ్చే నగదును ఇంటికి తీసుకువెళ్లి మరుసటి రోజుబ్యాంకులో డిపాజిట్‌చేస్తుండేవాడు.

ఈక్రమంలో బుధవారం రూ. 6.70 లక్షల నగుదు రావడంతో బ్యాగులో పెట్టుకొని రాత్రి 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో బుద్వేల్‌ ప్రధాన రహదారిపైకి రాగానే నలుగురు యువకులు రామును వెంబడించి వాహనంపై నుంచి నెట్టివేశారు. కిందపడిన అతడి వద్ద నుంచి బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. రాము వారిని అడ్డుకునే యత్నం చేయగా కట్టెలతో దాడి చేశారు.

దుండగులు తలపై మోదడంతో రాము అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం డబ్బులు ఉన్న బ్యాగును తీసుకొని నలుగురు యువకులు పరారయ్యారు. స్థానికులు విషయాన్ని గమనించి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడిని హైదర్‌గూడలోని ఉషామోహన్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు 18 కుట్టు వేశారు. ప్రస్తుతం రాము కోలుకుంటున్నాడు. తనపై దాడి చేసిన యువకులను మరోసారిచూస్తే గుర్తుపడతానని అతడు పోలీసులకు తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.  

మరిన్ని వార్తలు